
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు (WTE) వెస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు వల్ల పరిసరాల్లోని 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు విష వాయువులు ప్రభలి గాలి, నీరు, ఆహారం కలుషితమై శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తద్వారా ఈ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 3న హుజురాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వం తీసుకున్న డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టినట్లయితే ఈ ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరం వరకు గాలి, నీరు, పంటలు కాలుష్యమై మనుషులతో పాటు వృక్ష, జంతు సంపద నసిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆవులు, గేదెలు పాలు త్రాగడం, మేకలు, గొర్రెల మాంసం తినడం, కూరగాయలు. ఆకు కూరలు తినడంతో అనేక రకాల వ్యాధులు సోకి మనుషులు, పశు, వృక్ష సంపద నాశనం అవుతుందన్నారు. పాడి పంటలతో వర్థిల్లుతున్న ఈ ప్రాంతంలోని ప్రజలు వలస వెళ్లే ప్రమాదం పొంచి ఉందన్నారు.
10 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రజలు నిరసన దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో దారుణమన్నారు. గురువారం ఉదయం డంపింగ్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రభుత్వం డంపింగ్ యార్డు రద్దు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 3న తలపెట్టిన పట్టణ బంద్ కు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.





