
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందనీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హక్కుల సాధనలో ఒక కార్మిక బిడ్డను కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కార్మిక సోదరులారా.. ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. మరణం నిశ్శబ్దాన్ని మిగిలిస్తుంది, కానీ మన పోరాటానికి కావాల్సింది సజీవమైన గొంతుక. మన పోరాటం గెలవాలంటే మనం సజీవంగా ఉండి పోరాడాలి. ప్రాణాలు తీసుకుని కుటుంబాలను అనాథలు చేయకండి, ధైర్యంగా ఉండి మన హక్కుల కోసం కలిసి పోరాడుదాం.
ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడాలి. శంకర్ గౌడ్ మరణానికి బాధ్యత వహిస్తూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షాన.. గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇప్పటికైనా చర్చలు జరిపి, కార్మికులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.





