
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో అహోరాత్రులు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్మారకార్థం నూతనంగా నిర్మించిన ఆధునిక బ్యారక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “విధుల ఒత్తిడిలో ఉండే పోలీసులకు సరైన విశ్రాంతి ఎంతో అవసరం. ఇతర ప్రాంతాల నుండి బందోబస్తుకు వచ్చే వారికి, అలాగే ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బ్యారక్ను నిర్మించాం.”అన్నారు. “దేశం కోసం, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం ఈ భవనాన్ని అంకితం చేయడం గర్వంగా ఉందనీ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి.” అని ఆయన అన్నారు. “ఈ నూతన బ్యారక్లో సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందనీ,”పోలీసులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు అని అన్నారు. సిబ్బంది సౌకర్యార్థం ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.” అని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్, రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్, జమ్మికుంట టౌన్ సిఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న సిపి గౌస్ ఆలం






