
—అన్నదాతలకు ఇచ్చిన హామీల అమలులో విఫలం,
–ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండ గట్టడమే లక్ష్యంగా ఓసి జెఏసి ముందుకు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నధాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఈనెల 30న కరీంనగర్ వేదికగా భారీ ఎత్తున నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభకు మద్దతు కోరుతూ శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ నాయకులతో మండల కేంద్రంలో సమావేశం జరిపి మహాగర్జనకు సభకు ఆహ్వానిస్తూ పోలాడి రామారావు నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయగా అందుకు వారు సానుకూలంగా స్పందించి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి రామారావుతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు.

అనంతరం పోలాడి రామారావు, తాళ్ళపల్లి శేఖర్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500బోనస్ చెల్లింపులో అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో మిల్లర్లు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు ఆరు కిలోల నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ దాన్యాన్ని కామన్ గ్రేడ్ క్రింద జమ కడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు దాన్యాన్ని ఎండ బెట్టే క్రమంలో తీవ్రమైన ఎండలతో రైతులు మృత్యువాత పడటం కలచివేసిందన్నారు. పెట్టుబడి సాయం క్రింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పోలాడి రామారావు ద్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ రైతుల ఖాతాలో పూర్తిగా నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాలలో లారీలు, హమాళీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని పంటలకు బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకతీతంగా రైతాంగ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మందితో నిర్వహించతలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతుగా మహాగర్జన సమర భేరి సభకు పెద్ద ఎత్తున రైతులతో కలిసి తరలి వస్తామని ఆయా పార్టీల నాయకులు ప్రకటించడం పట్ల ప్రజా సంఘాల తరపున పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు, మానకొండూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్ళపల్లి శేఖర్ గౌడ్, జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, దేవ సతీష్ రెడ్డి, పంజాల శ్రీనివాస్, కసిరెడ్డి రాజేందర్ రెడ్డి, గోపు ఈశ్వర్ రెడ్డి, గంగుల రవి, బాకారపు రాములు, సర్పంచులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, తాళ్ళపల్లి సంపత్, పారునంది కిషన్, మోటం సమ్మయ్య, అనిల్ కుమార్, బండారు శ్రీనివాస్లతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





