
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రంథాలయం అనేది ఒక విజ్ఞాన భాండాగారం అని వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కాటిపల్లి సత్యనారాయణరెడ్డి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం నిర్వహించిన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కాటిపల్లి సత్యనారాయణరెడ్డి ప్రభుత్వ గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు నిరంతరం చదువుతూ ఉండండి ఎందుకంటే గ్రంథాలయం అనేది ఒక విజ్ఞాన భాండాగారం, ఇందులో దినపత్రికల నుంచి కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు, జీవిత చరిత్రలు ఇంకా అనేక రకాల విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. మీరు పాఠశాలలో కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే చదువుతారు.. కానీ లైబ్రరీలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు చదవడమే కాకుండా మీరు చదివిన విషయాలు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి అని అన్నారు.

ఈ సందర్భంగా లైబ్రరీ పుస్తకాలను చదవడం వల్ల ఏమి ఉపయోగం అని ఒక విద్యార్థిని అడగగా వీటిలో ఉన్న పుస్తకాలను చదివి నేను ఐఏఎస్ అవుతానని తెలిపారు. వెంటనే అతనిని ఆర్జెడి అభినందించారు. పోటీ పరీక్షలకు గ్రంథాలయం ఉపయుక్తంగా ఉంటుందని తెలిపి యువత తరచూ లైబ్రరీని సందర్శించాలని కోరారు.

కవి, రచయిత రావుల పుల్లాచారి, మంచికట్ల భాస్కర్ లు రచించిన పుస్తకాలను ఆవిష్కరించి వారిని శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు తప్పకుండా మండలంలో అన్ని పాఠశాలకి తెలియజేసి తద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
విద్యా వారోత్సవాలకు సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుని, పదవ తరగతి ఫెయిల్ అయిన రెమెడియల్ తరగతులను సందర్శించి విద్యార్థులకు సూచనలు ఇచ్చారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కోయల్ కార్ భారతి, లైబ్రేరియన్ కనకలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు డిఎం శోభారాణి, సమ్మిరెడ్డి, తిరుమల, రాధిక, పంజాల జ్యోతి, ఉపాధ్యాయులు వూరుగొండ సత్యప్రసాద్, కొంపెల్లి సంజీవ్, పుర ప్రముఖులు, విద్యాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





