Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మే 16:
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (TJS) మహిళా విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం (మే 16, 2026) ఆ పార్టీ మహిళా జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి సంయుక్తంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్కు ఒక అధికారిక లేఖను సమర్పించారు.
పోక్సో కేసు నమోదైనా అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం… గత కొంతకాలంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, నేటికీ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై టీజేఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.”రాజ్యాంగ చట్టం ప్రకారం నిందితుడు ఏ స్థాయి వ్యక్తి అయినా అందరూ సమానమే. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో నిందితుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం కూడా జరగడం లేదు. అదే సామాన్యులైతే నిందితుడు దొరికే వరకు వారి కుటుంబ సభ్యులను వేధిస్తారు.” అని లేఖలో మండిపడ్డారు. వివిధ కారణాల పేరుతో కోర్టులు కూడా విచక్షణతో వ్యవహరిస్తున్నాయని, నిందితుడి అరెస్టు ఆలస్యమైతే బాధిత మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉన్న రాజకీయ పలుకుబడి, అధికార అండదండలతో దర్యాప్తు వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని వారు లేఖలో ఆరోపించారు.
కావున, అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ను ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్టు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆ కుటుంబానికి అండగా నిలిచేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి పార్టీ మహిళా విభాగం తరపున రాష్ట్ర మహిళా కమిషన్ను వారు గట్టిగా కోరారు.

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలనీ రాష్ట్ర మహిళా కమిషన్ కి వినతి పత్రం అందించిన తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి..





