
—పరారీలో మరో ముగ్గురు నిందితులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) మే 21: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దారి దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు శరవేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది వ్యక్తులు అడ్డగించారు. వాహనంలో ఉన్న ఇద్దరిపై దాడి చేసి, వారిని ఎఫ్సీఐ గోదాం సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.

బాధితుల వద్ద నుంచి నగదు, అర తులం బంగారం ఉంగరం దోచుకోవడంతో పాటు ఫోన్పే ద్వారా సుమారు రూ.38 వేల వరకు బలవంతంగా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో లక్ష రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ బాధితులను రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా, వారు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జమ్మికుంట పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. మే 21 ఉదయం సైదాబాద్ ఎక్స్రోడ్–కోరపల్లి ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు.

నిందితుల వద్ద నుంచి రూ.14 వేల నగదు, అర తులం బంగారం ఉంగరం, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అరెస్ట్ అయిన వారిలో పల్లపు ఈశ్వర్ అలియాస్ బన్నీ, పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చుక్కారపు అఖిలేష్, మొగుళ్ల రాకేష్, పల్లపు మహేష్ (మల్లయ్య కుమారుడు), పల్లపు మహేష్ (రాములు కుమారుడు), తప్పేలా వంశీ ఉన్నారని తెలిపారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ మాధవి తెలిపారు.

నిందితులను అరెస్ట్ చూపుతున్న ఏసీపి మాధవితో పాటు స్థానిక సిఐ రామకృష్ణగౌడ్ తదితరులు..





