Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: వరి కోతల అనంతరం వరి, మొక్కజొన్న కొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, రైతుల ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లెలో వరి కొయ్యకాలకు నిప్పు పెట్టడంతో గాలికి మంటలు వ్యాపించి గడ్డి కట్టలతో వెళ్తున్న ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైన ఘటన దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. అలాగే రవాణా శాఖ బీట్ రిపోర్టర్ వెంకన్న తండ్రి నూనె ముంతల సత్తయ్య వరి కొయ్యలకు నిప్పు పెట్టే సమయంలో మంటలు చెలరేగి పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరెవరికీ జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

వరి కొయ్యకాలు తగులబెట్టడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నాశనం అవుతాయని, గాలి కాలుష్యం పెరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా పక్క పొలాలు, చెట్లు, విద్యుత్ లైన్లకు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు వరి పరకను ట్రాక్టర్ ద్వారా నేలలో కలపడం, పశువుల మేతగా వినియోగించడం, కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువుల తయారీలో ఉపయోగించడం, మష్రూమ్ పెంపకానికి వినియోగించడం, బేలర్ యంత్రాల ద్వారా సేకరించి విక్రయించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ కూడా పరక కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహిస్తోందని, రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.




