Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తిప్పారపు సంపత్పై పార్టీ అధిష్టానం వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్న వారిని ఉపేక్షించరాదని ఆయన పేర్కొన్నారు. సుమారు పదిమందితో ఒక ముఠాగా ఏర్పడి అక్రమ వసూళ్లకు పాల్పడిన నీకు ఎలాంటి మచ్చలేని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు. విమర్శించే హక్కు లేదు. గతంలో వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ ఆరోపణలతో జైలుకు వెళ్లిన జీవితాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు. అప్పట్లో ఇలాంటి వ్యవహారాల కారణంగానే పోలీసు అధికారులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, అదే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరమని టేకుల శ్రావణ్ మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకుల అండదండలతో రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన నీచ చరిత్ర సంపత్దేనని ఆయన ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత ఉండాలని, వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని ఉపయోగించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడి పార్టీని బలోపేతం చేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇలాంటి వారిపై అధిష్టానం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.





