
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారనీ, రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజల ఇబ్బందులు మరింత అధికమవుతున్నాయనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన నీటి సరఫరా, ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడం బాధాకరం అన్నారు. హుజురాబాద్ పట్టణానికి రోజుకు అవసరమైన 60 నుండి 70 లక్షల లీటర్ల నీటి సరఫరా ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 38 లక్షల లీటర్లకే పరిమితమవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
ట్యాంకర్లు కూడా ఎక్కువగా సమకూర్చలేకపోయిన ప్రభుత్వం ఇది అన్నారు. అనేక కాలనీల్లో ప్రజలు గంటల తరబడి బిందెలతో ఎదురుచూస్తున్నారన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు కూడా అందించలేని పరిస్థితి రావడం దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని హుజురాబాద్ పట్టణానికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలన్నారు.
సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనీ కౌశిక్ రెడ్డి కోరారు. ప్రజల సమస్యలపై మేము ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటామన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము అని ఆయన పేర్కొన్నారు.
వెంటనే మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాననీ, ఎక్కడ కూడా నీటి సమస్య ఉండోద్దు అన్నారు. గతంలో మాదిరిగానే నీటి టాంకర్లను ఏర్పాటు చేయాలనీ, సరఫరా ఉండాలనీ
అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆదేశించారు.




