
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలల్లో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్ద బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతి ముస్లిం పాటించాలన్నారు. శాంతియుతంగా సోదర భావంతో జీవించాలని, పేదలకు సాయం చేయాలని, ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. త్యాగానికి బక్రీద్ పండుగ నిదర్శనం అని అన్నారు. ప్రార్ధన అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. బక్రీద్ వేడుకలకు తగిన ఏర్పాట్లు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని కమిషనర్ కిషన్ ఇతర అధికారులు సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులకు జామే మస్జిద్ ఈద్గా, ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎండి ముజాహిద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామి మసీదు ఈద్గా కబ్రిస్తా మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు


జామే మస్జిద్ ఈద్గా, ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎండి ముజాహిద్ హుస్సేన్, ముస్లిం మత పెద్దలు, యువకులు





