
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్, దమ్మక్కపేట గ్రామంలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పట్నాల కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల పండుగగా పోచమ్మ, ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య, భక్తి పాటలతో, శివసత్తులు, పంబాల వారి ఆటపాటలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాలతోపాటు పట్నాలు వేసి, వోడి బియ్యం పోసి, పసుపు, కుంకుమ, దీప ధూప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం అని మహిళలు కొనియాడారు. ఆ తల్లుల ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు అందరూ పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవార్లను దర్శించుకుని కోరుకున్నారు. ఈ జాతరలో భాగంగా ఊరంతా ఐదు రోజుల పండుగ వాతావరణం నెలకొంది. ఈ జాతరలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్ సుహాసిని, కౌన్సిలర్లు, పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలతో వివిధ ప్రజలు దర్శించుకున్నారు.

.ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో బోనాలతో మహిళలు


దమ్మక్కపేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని దంపతులు..






