
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కేరళలో ప్రకృతి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు వయనాడ్ లో చాలామందిని బలితీసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205 కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ… కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 144 మంది మృతదేహాలు లభించాయి… అందులో 79 మంది పురుషులు, 64 మంది మహిళలు వున్నారు. మరో 191 మంది కనిపించడంలేదని…వారికోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు.
వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 8017 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని… వారికి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.ఈ క్యాంపుల్లో 1386 మంది తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన 201 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే బాధితుల వైద్య ఖర్చులతో పాటు భోజనం, వసతి ఏర్పాట్లు చూస్తోందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో కనిపించకుండా పోయినవారికి వెతికే పనిలో వెయ్యమందికి పైగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. .
గురువారం వయనాడ్కి రాహుల్, ప్రియాంకా గాంధీలు..
-కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటన..


ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఘటనలో 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. చాలా మంది ప్రజలు బురద, మట్టి కింద సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రభావిత వయనాడ్ ప్రాంతంలో గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బుధవారమే వీరిద్దరు వయనాడ్ వెళ్లాల్సి ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం ఫలితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కుదరదని అధికారులు తెలియజేయడంతో పర్యటన వాయిదా పడింది. వీరిద్దరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ యుపి స్కూల్, మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులను సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ, మెప్పాడిని కూడా సందర్శిస్తారని తెలియజేశారు





