Oplus_0
-ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి
-పాలన గత ప్రభుత్వం మాదిరిగానే ఉంది.. కేవలం జెండాలు మాత్రమే మారాయి.
-రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు
-సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ఈనెల 20న హుజురాబాద్ లోని మధువని గార్డెన్ లో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఉంటుందని
ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు హాజరుకానున్నారని, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో వివిధ పార్టీల నుంచి సిపిఐ పార్టీలోకి చేరికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి సమావేశంను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆలోచనలు లేకుండా హామీలు ఇచ్చిందని, గడిచిన తొమ్మిది నెలలుగా హామీల అమలుకు సరైన కార్యాచరణ చేపట్టలేదని ఆయన అన్నారు. ఎన్నికల హామీలకు ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున పలు సూచనలు చేస్తున్నామని, వాటన్నిటిని పాటించాలని అన్నారు. ఎన్నికల హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చే వరకు ప్రజల తరఫున సిపిఐ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని, అమలు మాత్రం ఆ స్థాయిలో జరగలేదన్నారు. చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఈనెల 31 లోపు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ కెనాల్ పై ఆధార పడి వ్యవసాయం చేసే రైతులు ఇంకా దుక్కులు దున్నలేదని, నీళ్లు లేక చాలా మంది రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి క్రాప్ హాలి డే ను ప్రకటిస్తూ ఎకరానికి రూ.50,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఏవైతే అమలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా వాటినే అనుసరిస్తుందని కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా పార్టీల జెండాలు తప్పా వేరే ఏమి లేదన్నారు. హుజురాబాద్లో గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉంటున్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కొంతమంది కౌన్సిలర్లు వేలల్లో రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పేదలతో వెళ్లి ఆ ఇళ్లను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, మండల కార్యదర్శి గోవిందు రవి, నాయకులు చాంద్ పాషా, రాజు, రాములు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్, నాయకులు రాముయాదవ్, ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంక దాసరి కళ్యాణ్, కృష్ణ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.






