
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ లభించింది. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్డీ పరిశోధక విద్యార్థిగా చేరారు. “మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికి గాను పీహెచ్డీ పట్టా పొందారు. ఇందుకు సంబంధించిన తను రాసిన పరిశోధన పత్రము 2022 ఆగస్టు నెలలో నెదర్లాండ్స్ కు చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ గార్టెరియాలో ముద్రించబడింది. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామంలోని పలువురు అభినందించారు. గత ఆరు సంవత్సరాలుగా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న పరమేశ్ ఇటీవలే సాధారణ బదిలీలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి మరియు అధ్యాపకులు ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 2004వ సంవత్సరంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందిన తను ఇప్పుడు అదే జంతు శాస్త్ర విభాగం నుండి పీహెచ్డీ పట్టా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఈ పరిశోధనలో తనకు సహకరించిన సహ ఆచార్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు పరమేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.






