
-మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం
-జీవో జారీ చేసేందుకు ఏకగ్రీవంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రతిపాదన
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాదులోని సెక్రటేరియట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం జరిగిందని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించేందుకు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 17వ తేదీ లోపు జీవో జారీ చేసేలా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానించి, ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదించడం జరిగిందని వెలిచాల రాజేందర్ రావు వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈనెల 20వ తేదీ నుండి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గల్ఫ్ కార్మికులు న్యాయం జరుగుతుం దని వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారని తెలిపారు.








