
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు ఓ పశువుల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన కంకణాల కృష్ణకుమార్ (30) ఉదయం తనకు ఉన్న పశువులను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లగా మధ్యాహ్నం ఉరుములు పిడుగులతో కూడిన వాన పడగా అదే సమయంలో ఓ పిడుగు కృష్ణకుమార్ వద్ద పడింది. దీంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశువులు మేత మేసి సాయంత్రం ఇంటికి వెళ్ళగా అతని భార్య మౌనిక తండ్రి కంకణాల సమ్మయ్య కృష్ణ కుమార్ సెల్కు ఫోన్ చేయగా పనిచేయకపోవడంతో పశువులను తీసుకువెళ్లిన చోటును వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ కృష్ణకుమార్ పిడుగుపాటుతో కాలిన గాయాలతో మృతి చెంది ఉండడం కనిపించడంతో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. మృతుని తండ్రి సమ్మయ్య గ్రామంలో సుంకరిగా పని చస్తుండగా, కృష్ణ కుమార్ కు భార్య మౌనికతో పాటు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఈ విషయం గ్రామస్తులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణకుమార్ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


