
–అన్న దాతల డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 28న కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి.
–రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పాలకులు రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు ముఖ్యంగా కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఉద్ధరణ కోసం అనేక కమిటీలు చేసిన సిఫారసులను వెంటనే ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు
బుధవారం రైతుల గిట్టు బాటు ధరపై ఎదుర్కొంటున్న సమస్యలు. . ఉపాధి హామీ పథకం పనుల వర్కర్లు పామాయిల్ తోటల వదానం గురించి కరీంనగర్ జిల్లా మానకొండూర్, శంకరపట్నం, హుజురాబాద్ మండలం, ఎల్కతుర్తి మండలాల్లో పోలాడి రామారావు క్షేత్ర స్థాయిలో పర్యటించి హన్మకొండ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పెంచికలపేట శివారు ప్రాంతం రైతు మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి పెంచుతున్న పామాయిల్ తోటల పెంపకం పనితీరును పరిశీలించారు.



అనంతరం గూడూరి స్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పంటల పై
ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టు బాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయరంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఆర్ధికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్ష మందితో రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన..సమరభేరి సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. పార్టీల కతీతంగా అందరినీ సభకు ఆహ్వానిస్తామని అన్ని జిల్లాలనుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారే సంఖ్యలో తరలి వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రైతు మిత్ర సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, నాయకులు బోయినపల్లి దేవేందర్ రావు, గూడూరి శంకర్ రెడ్డి గూటం జోగిరెడ్డి, మేకల చంద్రయ్య, చైతన్యరెడ్డి తదితరులు రైతులు ఉపాధి హామీ వర్కర్లు పాల్గొన్నారు.

హన్మకొండ జిల్లా పెంచికలపేట శివారు ప్రాంతమైన గూడూరి స్వామిరెడ్డి పెంచుతున్న పామాయిల్ సాగు విధానాన్ని రైతులతో కలిసి పరిశీలించి రైతుమిత్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న పోలాడి రామారావు.






