Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 1 : హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. జెఏసి ఆధ్వర్యంలో పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు, దీక్షలకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. బుధవారం అయన స్థానిక జెఏసి నేతలతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లుగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అయన డిమాండ్ చేసారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం జరిగితే..వాతావరణ కాలుష్యం ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని అయన ఆందోళన వ్యక్తం చేసారు. ఒకసారి డంపింగ్ యార్డ్ అండ్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరిగితే.. దానినుండి వెలువడే కాలుష్యం ఆపడం కష్టమని అన్నారు. ప్రతిరోజూ ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వాహనాలు చెత్తను ఇక్కడకు తీసుకువస్తామని, తద్వారా దుమ్ము, ధూళి అధికమవుతుందని, రైతుల భూముల ధరలు పడిపోతాయని, పిల్లలకు, మహిళలకు, శిశువులకు, వృద్దులకు ప్రాణహాని ఉంటుందని అయన అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని, ఇది హుజురాబాద్ భవిష్యత్తుకు, అభివృద్ధికి, ప్రజల జీవనానికి ముడిపడివున్న సమస్య అని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను కూడా జెఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో భాగంగా ఒకరోజు దీక్షలో త్వరలోనే పాల్గొంటానని అయన వివరించారు.





