Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే 13: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాధారణ ప్రసవం చేసినా తప్పని తిప్పలు. పుట్టుకతోనే ఎటువంటి స్పర్శ, కదలికలు లేకుండా జన్మించిన ఓ పసికందు, మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బాధితురాలి కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి అర్చన తన రెండో కాన్పు కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేశారు. అయితే, శిశువు జన్మించే సమయంలోనే బొడ్డు పేగు మెడకు చుట్టుకొని రావడం, అలాగే ఒంట్లో ఎటువంటి కదలికలు లేకపోవడంతో పరిస్థితి విషమించింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా దక్కని ఫలితంగా శిశువు పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయితే, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శిశువు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, బతికే అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. దీంతో నిరాశతో తిరిగి వరంగల్ నుండి హుజూరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి కన్నుమూసింది.

వైద్యాధికారి వివరణ.. ఈ ఘటనపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి స్పందిస్తూ.. “మహిళకు సాధారణ ప్రసవం చేసే సమయంలోనే నొప్పులు అధికమై శిశువు జన్మించింది. అయితే శిశువు బొడ్డు పేగుతో కలిసి రావడంతో పాటు, పుట్టుకతోనే స్పర్శ లేకుండా ఉండటంతో వెంటనే ఎంజీఎంకు రిఫర్ చేశాం. దురదృష్టవశాత్తు శిశువు మృతి చెందిందని తెలిసింది” అని పేర్కొన్నారు.





