
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే విస్తృత కార్యక్రమాన్ని శనివారం హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో గల రైతు వేదికలో నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్, కో ఆర్డినేటర్ డా.హరికృష్ణ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు రాబోవు ఖరీఫ్ లో తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, పంట వ్యర్థాలు కలియ దున్నడం ద్వారా నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి అని తెలిపారు. అలాగే అవసరం మేరకే రసాయనాల వాడకం, పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం, పారిశ్రామిక సంఘటన అనే విషయాలపై రైతులకు తెలిపారు.

తదుపరి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్త డా. కె మదన్ మోహన్ రెడ్డి మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగు ముఖ్యంగా సన్న రకాల సాగును ప్రోత్సహించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ పోల్సాని రామారావు మాట్లాడుతూ రైతులు సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. తదుపరి ఈ నెల రోజులు పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని చెబుతూ ఉప సర్పంచ్ రాజేశ్వర్ రావు సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి భూమారెడ్డి మాట్లాడుతూ రైతులు పంట వ్యర్థాలు కలియదున్నాలని, అలాగే వేస్ట్ డికంపోజర్ వాడాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని హారిక, అభ్యుదయ రైతులు, ఇతర రైతులు పాల్గొన్నారు.

Oplus_16908288







