
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్- యూజీ(NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి అరెస్టయ్యాడు. రసాయన శాస్త్రంలో లెక్చరర్ అయిన ఆయనను పుణేలో శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ పరీక్ష సంస్థ తరఫున ప్రశ్నపత్రాలు రూపొందించే బృందలో ఒకడైన కులకర్ణి.. మే 3న జరిగిన నీట్ పేపర్ను లీక్ చేశాడు. ప్రైవేట్ ట్యూషన్ల సమయంలోనే కులకర్ణి నీట్ పేపర్ను లీక్ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

నీట్- యూజీ(NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ – యూజీ ప్రశ్నాపత్రం లీకేజీలో కీలకమైన పీవీ కులకర్ణి పోలీసులకు చిక్కాడు. లీకేజీకి సూత్రధారి అయిన కులకర్ణిని శుక్రవారం పుణేలో సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ చివరి వారంలో కులకర్ణి మరో నిందితుడు మనీశా వాఘ్మరే సాయంతో తన ఇంట్లో కొందరు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. ఈ సమయంలోనే ఆయన నీట్ పేపర్ను లీక్ చేశాడని, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం వారికి చెప్పగా.. వారు నోటు చేసుకున్నారని సీబీఐ అధికారులు తెలిపారు.





