
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ : తన జీవనోపాధిగా ఉన్న తాటి చెట్లను అక్రమంగా నరికివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని బాధిత గీత కార్మికుడు పంతెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హుజురాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐని కలిసి ఈ మేరకు ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
బాధితుడి కథనం ప్రకారం: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ గౌడ పారిశ్రామిక సంఘంలో శ్రీనివాస్ (తండ్రి వీరస్వామి) సభ్యుడిగా ఉంటూ, గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నారు. శనివారం (మే 16) ఉదయం ఎప్పటిలాగే తాటి చెట్లు ఎక్కి, మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు. అయితే, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చెల్పూర్ గ్రామ శివారులోని ఎర్రకుంట వద్ద గల సర్వే నంబర్ 1316 పట్టా భూమిలో ఉన్న, కల్లు పారుతున్న 10 తాటి చెట్లను రాచపల్లి గ్రామానికి చెందిన గజవెల్లి సమ్మయ్య (తండ్రి లింగయ్య) అనే వ్యక్తి కట్టర్ మిషన్తో నరికివేశాడు. అదే గ్రామానికి చెందిన భూ యజమాని మామిడాల రాముక్క (భర్త రాంరెడ్డి) ఆదేశాల మేరకే ఈ నరికివేత జరిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.



అధికారిక గుర్తింపు కార్డు (ID No. 03202530071095) కలిగి ఉండి, చట్టబద్ధంగా వృత్తి చేసుకుంటున్న తన పొట్ట కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు గీసే చెట్లను నరకడం వల్ల తాను పూర్తిగా జీవనోపాధి కోల్పోయానని, నిందితులైన మామిడాల రాముక్క, గజవెల్లి సమ్మయ్యలపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.









