
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, సిర్సపల్లిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా రోగులకు నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలు సేవలందించారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డి ఎకో వంటి కీలక పరీక్షలు నిర్వహించి తక్షణ రోగ నిర్ధారణ చేశారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే రోగులను కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు, ఉప సర్పంచ్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిభిరంలో మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్దుల్ వకీల్, శ్రీకాంత్, వార్డు సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సిరిసపల్లి ప్రజలకు వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యంలు





