
—రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా
—వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:హుజురాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన మహిళలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డెలివరీ అయిన మహిళలకు “కేసీఆర్ కిట్” అందించేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసిందని విమర్శించారు. వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించిన ఎమ్మెల్యే, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని ఆధునిక వైద్య పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సరిపడా వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి





